2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి, అంతమంది ఆహార అవసరాలు ఎలా తీరతాయనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మెదళ్లను తొలిచే ప్రశ్న. జనాభా పెరుగుతోంది. ఆహార పదార్థాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఆ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. గత కొన్ని శతాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

1930లో ఒక అమెరికన్‌ రైతు, సగటున నలుగురు వ్యక్తులకు సరిపడా ఆహార ధాన్యాలు పండించేవారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో.. అంటే 1970 నాటికి ఆ సంఖ్య నలుగురి నుంచి 73 మందికి పెరిగింది.

ఆ తర్వాత వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం శరవేగంగా విస్తరించింది. దాంతో, 1970 నుంచి 2019 నాటికి వచ్చేసరికి ఆ సంఖ్య 73 నుంచి 155 మందికి చేరింది.

గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో యాంత్రీకరణ భారీగా పెరిగింది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. హైటెక్‌ యంత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు, పారిశ్రామిక, సాంకేతిక సేవల రంగాల్లో సంచలనం సష్టిస్తున్న కత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌), డేటా ఎనలిటిక్స్‌... వ్యవసాయంలోనూ కీలకంగా మారుతున్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పలు టెక్నాలజీ సంస్థలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి.

రోబో రైతులు

వ్యవసాయంలోకి రోబో 'రైతులు' ప్రవేశిస్తున్నారు. వచ్చే రెండు మూడు దశాబ్దాల కాలంలో వ్యవసాయం చాలావరకు డిజిటల్‌ అయిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతుగా.. కూలీగా.. వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఇలా అన్ని పనులూ అలవోకగా చేసే రోబోలు రానున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు రోబోల పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి.

ఆ రోబోలు పొలంలో కలుపు మొక్కలను గుర్తించి, తొలగించడం మొదలుకుని.. పంట కోత వరకు అన్ని పనులూ చేయగలవని నిపుణులు అంటున్నారు. అవి అందుబాటులోకి వస్తే రైతు పొలానికి వెళ్లాల్సిన పనుండదు. ఇంట్లో ఉండి స్మార్ట్‌ ఫోన్‌తో కమాండ్‌ ఇచ్చి రోబోలతో పంటలను పర్యవేక్షించొచ్చు.

వర్చువల్‌ రియాలిటీ

వర్చువల్‌ రియాలిటీ టెక్నాలజీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన విన్‌ఫీల్డ్‌ అనే సంస్థకు చెందిన చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ టెడీ బికాలిన్‌ అంటున్నారు. ఒక మొక్క ప్రతి అణువణువునూ పరీక్షించి, దాని ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడే వీఆర్‌ సాంకేతికతను అభివద్ధి చేసే పనిలో ఉంది ఈ సంస్థ.

'ఈ డ్రోన్లతో పంటచేలను త్రీడీ ఫొటోలు తీయొచ్చు. ఆ చిత్రాలను సెన్సార్లతో పరీక్షించి మొక్కల ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. చీడపీడలను స్పష్టంగా గుర్తించే వీలుంటుంది. అలాగే, ఆ మొక్కలకు ఎలాంటి పోషకాలు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సాంకేతికత రానున్న కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది'' అని టెడీ బికాలిన్‌ చెబుతున్నారు.

''గిట్టుబాటు కావడం లేదంటూ వ్యవసాయాన్ని వదిలేసిన రైతులను చూశాం. కానీ, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నందున గతంలో వ్యవసాయం అంటే వెనకడుగు వేసిన వారు కూడా ఇప్పుడు ఈ రంగంలోకి ఆసక్తిగా వస్తున్నారు. యువత సాగుపై ఆసక్తి చూపుతుండటం మంచి పరిణామం'' అని ఆయన అన్నారు.

చీడపీడలను తెలిపే రోబో

ఈ రోబో దానంతట అదే పంట పొలాల్లో తిరుగుతూ తన కెమెరాలతో మొక్కలను చిత్రీకరిస్తుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఆ ఫొటోలను విశ్లేషించి మొక్కల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తుంది. దాని ఆధారంగా రైతు పంటకు చీడపీడల గురించి, మొక్కలకు ఏయే పోషకాలు అవసరం అన్న విషయాలను తెలుసుకునే వీలుంటుందని ఈ రోబో తయారీ సంస్థ నిర్వాహకుడు చెప్పారు. ప్రస్తుతం యూకేలోని 25,000 ఎకరాల పంటచేలలో ఈ రోబోను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు.

ఇది మరో రకమైన రోబో. దీనికి అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఏ భూమిలో ఏ ఎరువును, ఏ పంటకు ఎంత మోతాదులో వాడాలో ఇది చెప్పేస్తుందట. దీనివల్ల ఎరువులపై పెడుతున్న ఖర్చు 90 శాతం తగ్గుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.

పంటల ఉత్పత్తిని పెంచుతాం

తేనెటీగలు, సీతాకోక చిలుకల్లాంటి మిత్ర కీటకాలు పంటల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. పుప్పొడి రేణువులను ఒక పువ్వు నుంచి మరో పువ్వుకు చేరవేస్తాయి. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా ఎన్నో కీటకాలు అంతరించి పోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట దిగుబడుల మీద తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా డ్రాప్‌ కాప్టర్‌ అనే స్టార్టప్‌ సంస్థ ఒక పరిష్కారం చూపిస్తోంది. ఈ సంస్థ ఒక ప్రత్యేకమైన డ్రోన్‌ను రూపొందించింది. అది పంట చేల మీద 10 అడుగుల ఎత్తులో తిరుగుతూ పుప్పొడి రేణువులను చల్లుతుంది. గంటకు 40 ఎకరాల చెర్రీ తోటను పూర్తిచేయగలదు.

''వివిధ కారణాలతో మిత్ర కీటకాలు కనుమరుగవుతున్నాయి. అలాగే, అత్యంత చలిగా లేదా అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో తేనెటీగలు ఉండవు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ డ్రోన్‌ను తయారు చేశాం'' అని డ్రాప్‌కాప్టర్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ ఆడమ్‌ ఫైన్‌ చెప్పారు. ''పొలాల్లో తేనెటీగలు తక్కువగా ఉంటే పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రైతులు మా వద్దకు వస్తే డ్రోన్ల సాయంతో దిగుబడులు పెంచే ప్రయత్నం చేస్తాం. అలా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించాం. మా సాంకేతికత తేనెటీగలకు ప్రత్యామ్నాయం అని చెప్పడం లేదు. కానీ, ఇదొక అవకాశంగా పరిగణించొచ్చు'' అని ఆయన అన్నారు.

డ్రోన్‌తో పిచికారీ

ఎల్‌ సాల్వడోర్‌ దేశంలోని చెరకుతో పాటు వివిధ రకాల తోటలపై డ్రోన్లు ఎగురుతున్నాయి. ఈ డ్రోన్లు 20 లీటర్ల ట్యాంకులతో పంటలపై ఎరువులను, పురుగుమందులను పిచికారీ చేస్తున్నాయి. ఈ డ్రోన్లను హైలియా అనే సంస్థ రూపొందించింది. ట్రాక్టర్లు, ప్లేన్‌లు పిచికారీ చేయలేని ప్రాంతాల్లో సైతం ఈ డ్రోన్ల సాయంతో ఎరువులను, మందులను పిచికారీ చేయగలుగుతున్నామని ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ సంస్థ ప్రతినిధి నిక్‌ నవ్రతిల్‌ వివరించారు.

ఈ విధానంతో పంటల దిగుబడి కూడా పెరుగుతుందని ఆయన అంటున్నారు. ఈ డ్రోన్‌తో ఒక పూటలో దాదాపు 40 హెక్టార్ల పొలానికి పురుగుమందు పిచికారీ చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు. భారత్‌లోని పత్తి పంటలపై కూడా ఇలాంటి డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

10% అధిక దిగుబడి

ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌నోవ్‌ సంస్థ రూపొందించిన డ్రోన్లకు కెమెరాలు అమర్చి ఉంటాయి. ఈ కెమెరాల సాయంతో మొక్కల పెరుగుదల సమయంలో వాటికి నైట్రోజన్‌ ఏ స్థాయిలో అందుతోందో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి, పంటకు ఏ సమయంలో ఎరువులు వాడాలి? పంటలో ఏ ప్రాంతంలో ఎరువులు ఎక్కువ అవసరం? లాంటి విషయాలు తెలుసుకోవడం సులభమవుతుంది.

ఈ విధానం ద్వారా.. ఎరువులు, మందులు వ ధా అవ్వవు. ఖర్చు కూడా తగ్గుతుంది. దీనివల్ల తమకు 10% అధిక దిగుబడి వచ్చిందని ఫ్రాన్స్‌లో భారీ ఎత్తున వ్యవసాయం చేసే సహకార సంస్థ 'ఒసీలియా' తెలిపింది. వీటికి అమర్చిన మల్టీ స్పెక్ట్రల్‌ సెన్సార్‌లు కంటికి కనపడని ఇన్ఫ్రారెడ్‌, రేడియేషన్‌, అల్ట్రావయొలెట్‌ కిరణాలను కూడా రికార్డు చేయగలవు. దాంతో పంటలకు పోషకాల లోపం, పురుగు పట్టడం, నీరు సరిగా అందకపోవడం లాంటి పరిస్థితులను ఇట్టే గుర్తించవచ్చు.

ఉపాధికి గండి పడుతుందా?

అయితే, టెక్నాలజీ పెరగడం వల్ల రైతులకు ఖర్చులు, శ్రమ, సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఇదే సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కూలీల కొరత ఉన్న చోట రోబోల వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, వ్యవసాయమే ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న ప్రాంతాల్లో రోబోటిక్‌ సాగుతో ఈ సమస్య ఉ త్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.

బిబిసి న్యూస్‌ తెలుగు సౌజన్యంతో...