పసుపు కేవలం హిందూ సాంప్రదాయపు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వినియోగానికి, వంట ఇంటి అవసరానికి మాత్రమే ఇన్నేళ్ళూ పరిమితమైంది. ఇప్పుడు దానిలోని ప్రత్యేక ఔషధ గుణాలను వెలికి తెచ్చి అదనపు విలువలను జోడించి మార్కెట్‌లోకి ఒక ఔషధ వస్తువుగా శరవేగంతో పరిచయం చేస్తున్న నేపధ్యంలో పసుపు పంటకు ప్రాధాన్యత ఏర్పడింది.

బహుళజాతి ఔషధ కంపెనీలకు ధీటుగా పసుపు ప్రత్యామ్నాయ వైద్య వస్తువుగా ప్రాచుర్యం పొందుతున్న నేపధ్యంలో ర్క్యుమిన్‌ అధికశాతం కలిగిన విత్తనాల ద్వారా సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దానికితోడు రైతుల స్పందన అధికంగా రావడంతో తెలంగాణ ప్రాంతంలో కొత్తతరహాసాగు ఆరంభమై పసుపు పంటపై లాభార్జన కొరకు ఆశలు మోసులెత్తుతున్నాయి. పసుపు రైతుల పంట సాగు మెరుగుగా ఉండేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తెలంగాణాలో సుమారుగా 70,000 హెక్టార్లలో సాగు చేస్తూ 3,92,321 టన్నుల దిగుబడి సాదిస్తూ ఉంది.

వాతావరణం :

పసుపు దుంప జాతి ఉష్ణ మండల పంట. తేమతో కూడిన వేడి వాతావరం అనుకూలం. పసుపు పండించుటకు సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తు వరకు,18-350 సె. వరకు, 800-1400 మి.మీ, వర్షపాతం గల ప్రాంతాల్లో సాగు చేసుకోవచ్చు .

నేలలు :

నీరు నిలువని నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన నల్లని భూములు ఉదజని సూచిక 6-7.5 వరకు గల భూములు ఈ పంటకు అనుకూలం. ఇసుక నేలలు, క్షార నేలలు, రాళ్ల నేలలు పసుపు పంటకు అనుకూలం కాదు.

రకాలు :

తెలంగాణా రాష్ట్రంలో సాగు చేసే రకాల్లో ముఖ్యమైనవి దుగ్గిరాల ఎరుపు, ఆర్మూర్‌ రకం, ప్రతిభ సేలం, పిటిఎస్‌ 10 రకాలు వాటి కాల పరిమితిని అనుసరించి మూడు రకాలుగా విభజించడం జరిగింది

స్వల్ప కాలిక రకాలు : ఈ రకం కేవలం 6-7 నెలల్లో తవ్వడానికి వస్తాయి. వాటిలో ముఖ్యంగా కస్తూరి, ప్రతిభ, ప్రభ ముఖ్యమైనవి

మధ్య కాలిక రకాలు : ఈ రకం 8 నెలల్లో కోతకు వస్తుంది. వీటిలో ముఖ్యంగా కొత్త పేట, కేసరి కష్ణ ముఖ్యమైనవి

దీర్ఘ కాలిక రకాలు : ఈ రకం 9 నెలల్లో పంట కోతకు వస్తుంది. వీటిలో దుగ్గిరాల ఎరుపు ఆర్మూర్‌ ముఖ్యమైనవి

పొలం తయారీ :

వేసవిలో భూమిలో లోతుగా గుల్లగా దున్నాలి. భూమిని రెండు సార్లు కల్టివెటర్‌తో, రెండు సార్లు డిస్క్‌ నాగలితో, ఒకసారి రోటావెటరుతో దున్నుకోవాలి.

విత్తు సమయం :

పసుపు విత్తు సమయం ముఖ్యంగా రుతు పవనాలపై ఆధారపడి ఉంటుంది. జూన్‌ మెదటి మరియు రెండవ వారంలో నాటికీ దుంపలు ఆరోగ్యకరంగా మరియు దఢంగా నిలదొక్కుకుంటాయి. జులై నెలాఖరులో గాని ఆగష్టులో నాటిన దుంపలు అంత ఆరోగ్యకరంగా ఉండవు, అంతగా దిగుబడి కూడా రాదు. పసుపు దుంపలు తవ్విన నాటిన నుండి 2 నెలలు నిద్రావస్థలో ఉంటాయి.

విత్తన దుంప ఎంపిక :

విత్తనానికి పిల్ల దుంపల కంటే తల్లి దుంపలు శ్రేష్టకరం, ఆధిక దిగుబడి వస్తుందని నిరూపితమైనది, తల్లి దుంపలను కొడవలితో రెండుగ చీల్చి నాటుకోవాలి. కొమ్ములను విత్తనానికి ఎంచుకున్నట్లైతే 10-15 గ్రా. ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. ప్రతి కత్తిరింపు ముక్కలో కనీసం రెండు కణుపులు ఉండే విధంగా చూసుకోవాలి.

విత్తన మోతాదు :

తల్లి దుంపలు : 800-1000 కి / ఎకరానికి

కొమ్ములు : 600-800 కి / ఎకరానికి

తోటలో దుంపలు : 200- 400 కి / ఎకరానికి

విత్తన శుద్ధి :

కత్తిరించిన పసుపు దుంపలను లీటరు నీటికి 3 గ్రా. రిడోమిల్‌ యం.జెడ్‌ మరియు 2 మి.లీ మోనోక్రోటోఫాస్‌ చొప్పున కడాయిలో ద్రావణాన్ని తయారు చేసుకొని 45 ని. ముంచుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. తరువాత ట్రైకోడెర్మావిరిడి అనే శిలీంద్ర నాశినితో దుంపలను శుద్ధి చేసుకుంటే మంచిది.

నాటు పద్దతులు :

పసుపు 3 పద్ధతుల్లో నాటుకోవచ్చు

1. సమాంతర మడి పద్దతులు :

ఈ పద్ధతిలో 30 సెం.మీ. దూరంలో నాగలితో సాలు చేసి దమ్ముకు మధ్యలో 15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. అదే విధంగా భూమిని 3 మీటర్ల వెడల్పు గల మడులుగా తయారు చేసుకోవాలి. ఈ పద్ధతి ద్వారా దుంపలు అంతగా ఊరవు మరియు దుంప కుళ్ళు వచ్చే ఆస్కారం ఎక్కువ.

2.బోదె సాళ్ళ పద్ధతి :

ఈ పద్ధతిలో 45 సెం.మీ. దూరంలో ఉండే విధంగా బోదెలను తయారు చేసుకోవాలి . దుంపలను 20 సెం.మీ. దూరం లో బోదెలపై విత్తుకోవాలి .ఈ పద్ధతిలో దుంప కుళ్ళు వచ్చే ఆస్కారం తక్కువ.

3. ఎత్తు మడుల పద్ధతి :

ఈ పద్దతిలో 110 సెం.మీ. వెడల్పుతో 15 సెం.మీ. ఎత్తుతో అవసరమైన పొడవైన, ఎత్తైన మడులు తయారు చేసుకోవాలి. మడికి మడికి మధ్య దూరం కనీసం 30 సెం.మీ. ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి ఎత్తు మడిలో నాలుగు సాళ్ళు వచ్చే విధంగా చూసుకోవాలి. సాలుకు సాలుకు మధ్యలో 30 సెం.మీ. దూరం ఉండాలి. విత్తన కొమ్ములను 15 సెం.మీ. దూరంలో సాలులో నాటుకోవాలి. ఈ పద్ధతి ద్వారా దుంపలను మంచిగా ఊరి, దుంప కుళ్ళు ఆశించదు. ఈ పద్ధతిలో 20-30 శాతం వరకి అధిక దిగుబడి వస్తుందని నిరూపితమైనది మరియు ట్రాక్టర్‌తో దుంపలను తవ్వడం తేలిక అవుతుంది .

చీడ పీడలు :

1. దుంప ఈగ :

ఈ కీటకం వల్ల తోటల్లో విపరీత నష్టం కలుగుతుంది. ఈ కీటకం కాండం తొలుచుతూ అంతర్గతాన్ని తింటూ మలినాలను బయటికి పంపిస్తుంది. ఈ కీటకం వల్ల ఆకులపై వరుస రంధ్రాలు ఏర్పడతాయి. ఈ కీటకం నివారణకు 10 కిలోల 3జి కార్బోఫ్యురాన్‌ గుళికలను చల్లుకోవాలి. అదే విధంగా లీటరు నీటికి 1 మి.లీ. డైమిథోయట్‌ లేక 1 మి.లీ. ప్రోఫెనోఫాస్‌ను పిచికారి చేసుకోవాలి. ఎకరాకు 5 కిలోల వేప పిండి తోటలో చల్లుకోవాలి.

2. అల్లిక రెక్క నల్లి :

ఈ కీటకాల ఆకులు అడుగు భాగంలో తల్లి పిల్ల పురుగులు ఉండి రసం పీల్చడం వల్ల ఆకు పై భాగాన తెల్లని మచ్చలు ఏర్పడతాయి. నివారణకు లీటరు నీటికి రెండు మి.లీ. డై మిథోయట్‌ లేదా 2 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ వంతున పిచికారి చేసుకోవాలి.

3. తాటాకు మచ్చ తెగులు :

ఆకులపై పెద్ద పెద్ద అండాకారపు మచ్చలు పెరిగి 4-15 సెం.మీ.I 2-3 సెం.మీ. సైజులో ముదురు గోధుమ రంగులో ఉంటాయి. మచ్చ చుట్టూ పసుపు రంగు వలయం ఉంటుంది. ఈ మచ్చలు ఆకంతా వ్యాపించి ఆకు మాడిపోతుంది. నివారణకు లీటరు నీటికి 1 మి.లీ. ప్రోపికోనజోల్‌ లేదా 1 గ్రా. కార్బండిజిమ్‌ + 2.5 గ్రా. మాంకోజెబ్‌ కలిపి పిచికారి చేసుకోవాలి.

4. ఆకు మాడు తెగులు :

ఈ తెగులు వల్ల ఆకులపై ముందుగా చిన్న చిన్న పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు క్రమేపి అండాకారంగాను లేక దీర్ఘ చతురస్రాకారం గాను ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు అనేకం కలిసి ఆకు మాడిపోతుంది. నివారణలో భాగంగా లీటరు నీటికి 1 మి.లీ. ప్రోపికోనజోల్‌ లేదా 1 గ్రా. థయోఫోనేట్‌ 1 గ్రా. కార్బండిజం + 2.5 గ్రా. మాంకోజెబ్‌ కలిపి పిచికారి చేసుకోవాలి.

5. దుంప కుళ్ళు తెగులు :

ఈ తెగులు వల్ల కాండం పై నీటితో తడిచిన మచ్చలు ఏర్పడి మెత్తగా మారుతుంది. క్రమేపి దుంపలు కుళ్ళి పోతాయి. తద్వారా ఆకులు కొమ్మలు మాడి ఎండిపోతాయి. వేర్లు కూడా కుళ్ళుతాయి. వత్తితే నీరు కారుతుంది. యాజమాన్యంలో భాగంగా ముందు గానే దుంపలను లీటరు నీటికి 3 గ్రా. రిడోమిల్‌ ద్రావణంలో 45 నిమిషాలు ముంచుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి. తోటల్లో తెగులు లక్షణాలు కన్పించగానే లీటరు నీటికి 2 గ్రా. రిడోమిల్‌ ఎంజడ్‌ లేదా 3 గ్రా. కాప్టాన్‌ వంతున కలిపి మొక్క చుట్టూ నేల తడిచేలా మందు మిశ్రమాన్ని మొక్క కాండం వద్ద పోసుకోవాలి.

వేణు గోపాల్‌ గుడిపెల్లి, ఉద్యాన శాస్రవేత్త,

కషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, ఫోన్‌ : 9705170776