తెలంగాణ రాష్ట్రంలో వరి సుమారుగా 44 లక్షల ఎకరాల్లో సాగవుతూ, సగటున ఎకరాకు 1,176 కిలోల దిగుబడులు నమోదు అవుతున్నాయి. తెలంగాణాలో వరి 72 శాతం బావులు మరియు బోర్ల కింద, 13 శాతం చెరువుల కింద, 15 శాతం కాలువల కింద సాగులో ఉంది. సాధారణంగా వరిని నార్లు పోసి నాట్లు వేయడం పరిపాటి. వాతావరణంలో వస్తున్న మార్పుల మూలంగా వర్షాలు సకాలంలో కురవక, నార్లు పోయడం మరియు నాట్లు వేయడం ఆలస్యం అవడం వల్ల వరి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. అంతేగాక అధిక కూలీల రేట్ల వలన రైతుకు సాగు ఖర్చు పెరిగి వరి సాగు గిట్టుబాటు కావడంలేదు. నారును నెల రోజుల పాటు పెంచి నారు పీకి నాటు వేయడానికి ఎకరాకు సుమారు రూ. 4,000/- వరకు ఖర్చు అవడమే కాక నీటి వాడకం అధికమవుతుంది. ఈ నేపధ్యంలో వరి సాగులో ప్రత్యామ్నాయ పద్ధతుల వైపు దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
దమ్ము చేసిన పొలాల్లో మొలకెత్తిన విత్తనాలను డ్రమ్ సీడరు ద్వార విత్తడం రైతులకు తెలిసిన పాత పద్ధతే అయినప్పటికీ, సరైన కలుపు నాశినులు లేకపోవడము వల్ల ఈ పద్ధతి ఎక్కువగా ప్రాచుర్యాన్ని పొందలేక పోయింది. వరి విత్తినప్పటి నుంచి నెల రోజుల వరకు కూడా వాడుకోదగ్గ కలుపు మందులు ప్రస్తుతం అందుబాటులోనికి రావడంతో రైతులు డ్రమ్ సీడర్ వరి సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
డ్రమ్ సీడర్ పద్థతిలో నార్లు పెంచుకోవలసిన అవసరం లేదు.
నాటువేసే పనిలేదు, కాబట్టి నాటుకు అవసరమైన కూలీల ఖర్చును ఆదా చేయవచ్చు.
విత్తన మోతాదును సగానికి సగం తగ్గించవచ్చు.
డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తినప్పుడు, ఒక చదరపు మీటరుకు ఉండవలసిన మొక్కల సంఖ్య ఖచ్చితంగా ఉండడం వల్ల, వరి దిగుబడులు నాటు వేసిన వరికన్నా అధికంగా ఉంటున్నాయి.
కలుపు నివారణకు, వరి సాళ్ళ మధ్య కోనోవీడర్ నడపవచ్చు, దీని వల్ల కలుపును సేంద్రీయ ఎరువుగా మార్చుకోవడానికి అవకాశం ఉంది మరియు అంతరకృషి వల్ల వేర్లు బాగా పెరిగి, దిగుబడులు పెరుగుతాయి.
వర్షాలు ఆలస్యమై నీరు సకాలంలో అందనప్పుడు, కాలువల ద్వారా నీటి విడుదల ఆలస్యమైనప్పుడు, ముదురు నార్లతో నాట్లు వేయడము జరుగుతుంది. దీనివల్ల వరిలో దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. అలాంటి పరిస్థితుల్లో డ్రమ్ సీడర్ పద్ధతి అనువుగా ఉంటుంది.
నాటువేసిన వరి కన్నా 5-7 రోజులు ముందుగా డ్రమ్ సీడర్తో వేసిన వరి కోతకు వస్తుంది.
డ్రమ్ సీడర్ పద్ధతి చౌడు నేలలకు, నీటి ముంపుకు గురి అయ్యే ప్రాంతాలకు అనువు కాదు.
పొలం ఎత్తు, వంపులు లేకుండా చదునుగా ఉండాలి. అలా లేనట్లయితే నీరు నిలువ ఉండి మొలక మురిగి, మొక్కల సంఖ్య తగ్గిపోతుంది.
డ్రమ్ సీడర్ పద్ధతిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. కలుపు నివారణ అనివార్యం.
డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలను విత్తిన వెంటనే వర్షం పడితే గింజలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు గానీ, వర్ష సూచనలున్నప్పుడు గానీ, డ్రమ్ సీడర్తో విత్తడాన్ని వాయిదా వేయాలి.
తేమ నిలువని తేలిక నేలలు, బాగా గాలి వీచే ప్రాంతాల్లో మొలకలు ఎండిపోయే అవకాశం ఉంది. మొలక ఆరిపోకుండా సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి.
సాధారణంగా వరి సాగుచేసే అన్ని నేలలు అనుకూలం, దిగబడు భూమిలో మరియు చౌడు భూముల్లో కొంత వరకు ఇబ్బంది ఉంటుంది.
సాధారణ పద్ధతిలో వరి నాటేటప్పుడు భూమిని తయారు చేసినట్లుగానే ఈ పద్ధతిలో కూడా తయారు చేయాలి. సాధ్యమైనంత వరకు పొలమంతా సమానంగా ఉండేటట్లు చేయాలి. వీలైతే పైపు సహయంతో లేదా కర్ర సహాయంతో సమానం చేసుకోవాలి.
కాలం : రబీ సీజన్
రకం : ఏ రకమైనా ఈ పద్ధతిలో సాగుచేసుకోవచ్చు.
విత్తన శుద్ది :
కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజమ్ పొడి, నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టాలి.
కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజల్లోని నిద్రావస్థను తొలగించి అధిక మొలక శాతం రావడానికి, లీటరు నీటికి తక్కువ నిద్రావస్థ వున్న విత్తనాలకైతే 6.3 మి.లీ లేదా విజేతలాంటి ఎక్కువ నిద్రావస్థ ఉన్న విత్తనాలకైతే 10 మి.లీ. గాఢ నత్రి కామ్లం కలిపిన ద్రావణంలో 24 గంటల వరకు నానబెట్టాలి. మరో 24 గంటల పాటు మండెకట్టాలి.
24 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత 24 గంటలు మండె కట్టిన విత్తనాలు ముక్కు పగులుతే చాలు. అలస్యమైతే తెల్లని మొలక ఎక్కువ
వచ్చి డ్రమ్లో పోసినపుడు గింజ జారదు. ప్రధాన పొలంలో విత్తడం :
విత్తే సమయానికి నీరు లేకుండా బురద బురదగా ఉంటే చాలు. డ్రమ్ సీడర్ పరికరానికి 4 ప్లాస్టిక్ డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెం.మీ దూరంలో రెండు చివర్ల రంద్రాలు చేసి ఉంటాయి. గింజలు రాలడానికి వీలుగా ప్రతి డ్రమ్లో కేవలం 3/4 వంతు మాత్రమే గింజలను నింపాలి. ఒకసారి గింజలు నింపిన డ్రమ్సీడర్ లాగితే 8 వరుసల్లో వరుస వరుసకు మధ్య 20 సెం.మీ. దూరంలో గింజలు పడతాయి. వరుసలో కుదురు కుదురుకు మధ్య దూరం 5-8 సెం.మీ ఉంటుంది.
ఒక ఎకరా విత్తడానికి కేవలం ఇద్దరు సరిపోతారు. (డ్రమ్సీడర్ బరువు కేవలం 8 కిలోలు)
ఒక ఎకరా విత్తడానికి సాధారణంగా 2-3 గంటలు పడుతుంది.
నత్రజిని 40-48 కిలోలు, భాస్వరం 24 కిలోలు మరియు పొటాష్నిచ్చే ఎరువులను 16 కిలోలు, 20 కిలోల జింక్ సల్ఫేట్లను ఎకరానికి వేయాలి.
విత్తిన 4-5 రోజుల తర్వాత నీరు తీసివేసి తేమ ఉన్నప్పుడు ఎకరాకు 35 గ్రా. ఆక్సాడయార్జిల్ 1/2 లీటరు నీటిలో కలిపి దాన్ని 20 కిలోల పొడి ఇసుకలో కలిపి పొలమంతా చల్లాలి. ఆరుతడిలాగా నీరు పెట్టినపుడు కలుపు మొలచినట్లైతే, సన్నగడ్డి మరియు వెడల్పాకుల కలుపు మొక్కలు ఉన్నట్లయితే 2-5 ఆకుల దశలో బిస్ పైరిబాక్ సోడియం 100 మి.లీ. లేదా అల్మిక్స్ (క్లోరిమ్యూరాన్ ఇథైల్ + మెట్సల్యూరాన్ మిథైల్) 8 గ్రా. + సైహలో ఫాప్ బ్యూటైల్ 250 మి.లీ మందును 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మీద పడేటట్లు పిచికారి చేయాలి. ఈ కలుపు మందు పిచికారి చేసిన తరువాత 3 రోజల వరకు నీరు పెట్టరాదు. ఈ పద్ధతి ద్వారా నాటుకున్నప్పుడు పవర్ వీడర్ సహాయంతో అంతరకృషి చేసి కలుపును సమర్థవంతంగా తక్కువ సమయంలో నిర్మూలించవచ్చు.
డ్రమ్ సీడర్ పద్ధతిలో విత్తిన తర్వాత 2-3 రోజుల వరకు నీటి నిలువ వల్ల మొలకలు మురగ కుండా జాగ్రత్త వహించాలి.
మొక్కలు మొదటి ఆకు పూర్తిగా విచ్చుకొనే వరకు (సుమారు 7-10 రోజుల వరకు) ఆరుతడులు ఇవ్వాలి.
పిలక దశ నుండి చిరుపొట్ట దశ వరకు పొలంలో పలుచగా (1-2 సెం. మీ.) నీరు ఉంచాలి.
పూత దశ నుండి, గింజ గట్టి పడే వరకు 3-5 సెం.మీ. నిల్వ ఉండేలా జాగ్రత్త వహించాలి.
కోతకు వారం / పది రోజులు ముందుగా నీరు పెట్టడం ఆపివేయాలి.
డ్రమ్ సీడర్ వరి వరస క్రమంలో ఉంటుంది కాబట్టి సూర్యరశ్మి, గాలి బాగా సోకి చీడపీడల బెడద తగ్గుతుంది.
పి. మధుకర్ రావు, శాస్త్రవేత్త (అగ్రానమి), యన్. నవత, శాస్త్రవేత్త (అగ్రానమి), లబి.మాధవి, శాస్త్రవేత్త (అగ్రానమి),
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం, పొలాస, జగిత్యాల