భారతదేశంలో సాగుచేస్తున్న ముఖ్యమైన నూనె గింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైనది. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వేరుశనగ పండించే జిల్లాల్లో అనంతపురం, కడప, కర్నూలు మరియు చిత్తూరు జిల్లాలు ముఖ్యమైనవి. కర్నూలు జిల్లాలో సుమారు 99,746 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. సరాసరి ఉత్పదకత 3,589 కి/హె. ఇసుక మరియు ఎర్ర నేలలు వేరుశనగ సాగుకు అనువైనవి. నల్లరేగడి మరియు మట్టి నేలలు సాగుకు పనికిరావు.
నూనె గింజలు, అపరాలలో ఉత్పాదకతను పెంచడానికి డి.బి.టి వారు బయోటెక్ కిసాన్ హబ్ అనే పథకాన్ని రూపొందించడం జరిగింది. పైలెట్ పథకంలో భాగంగా భారతదేశంలో 4 విశ్వ విద్యాలయాలకు మాత్రమే ప్రాముఖ్యతనివ్వడం జరిగింది. డి.బి.టి బయోటెక్ కిసాన్ హబ్ అనే పథకాన్ని డి.బి.టి వారి ఆర్ధిక సౌజన్యంతో ఏరువాక కేంద్రం బనవాసి వారు అమలుపరుస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఏరువాక కేంద్రం వారు కదిరి పరిశోధనా స్థానం వారు రూపొందించిన కదిరి అమరావతి -1535 అనే బ్రీడరు వేరుశనగ రకాన్ని కర్నూలు జిల్లాలో 20 మంది రైతులతో ఒక్కో ఎకరా చొప్పున ప్రయోగాత్మకంగా సాగుచేయించడం జరిగింది.
ఎమ్మిగనూరు మండలంలోని వెంకటాపురం గ్రామంలో రైతు దివాకర్ తన ఎకరం పొలంలో కదిరి అమరావతి -1535 వేరుశనగ రకాన్ని సాగుచేశాడు. సాధారణంగా ఈ రకం ఆకుమచ్చ తెగులును, రసంపీల్చే పురుగులను, బెట్టను, మొవ్వు కుళ్ళును, కాండం కుళ్ళు వైరస్ తెగులును సమర్థవంతంగా తట్టుకొని, 115-120 రోజుల్లో కోతకు వచ్చి ఎకరాకు 10-15 క్వి. దిగుబడినిస్తుంది. రైతు దివాకర్ 2018 జూన్ 6వ తేదీన విత్తనం వేయడం జరిగింది. ఎకరాకు 60 కిలోల విత్తనం వేయడం జరిగింది. విత్తేముందు దుక్కిలో 3 టన్నుల పశువుల ఎరువు, 2 కిలోల ట్రైకోడెర్మా విరిడి, 10 కిలోల వేపచెక్క పొలంలో చల్లి కలియదున్నాడు. విత్తిన 25 రోజుల తరువాత కోళ్ళ ఎరువు 3 క్వి. వేసి అంతరకషి చేశారు. ఊడలు దిగే సమయంలో నీటి తడిపెట్టి 200 కిలోల జిప్సం వేయడం జరిగింది. విత్తిన 60 రోజులప్పుడు 250 మి.లీ. వేపనూనె + 1 కిలో 13-0-45 + 250 మి.లీ. కానుగ నూనె కలిపి పిచికారి చేశారు.
సస్య రక్షణలో భాగంగా లింగాకర్షణ బుట్టలు, పసుపు మరియు నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఉంచి పురుగు ఉధతిని గమనించడం జరిగింది. విత్తనం విత్తడం దగ్గర నుంచి కోత వరకు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు పంటను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు అందించారు. ఈ పంటను సెప్టెంబర్ 10న నూర్చడం జరిగింది. ఎకరాకు 14.25క్వి (35.6 బస్తాలు ఒక్కో బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చింది. కాయ నాణ్యత, గింజ బరువు అధికంగా ఉండటం వల్ల రైతుకు ఒక్కో క్వి రూ.4,950 చొప్పున అమ్మగా రూ. 70,537 ఆదాయం వచ్చింది. పంటసాగుకు ఎకరాకు రూ. 33,400 ఖర్చయింది. సాగు ఖర్చులు పోనూ రైతుకు రూ. 37,137 నికరాదాయం లభించింది.
ఆదేవిధంగా ఈ రైతు మరో ఎకరంలో కదిరి-6 రకాన్ని కూడా సాగుచేశాడు. పైన పేర్కొన్న విధంగానే సాగు, యాజమాన్య పద్ధతులు పాటించాడు. ఇందులో ఒక ఎకరానికి 9.24 క్వి (23.1 బస్తాలు ఒక్కో బస్తా 40 కిలోలు) దిగుబడి వచ్చింది. సాగు ఖర్చు రూ. 30,950 అయింది. ఒక్కో క్వి రూ. 4,950 అమ్మగా, రూ. 45,738 ఆదాయం వచ్చింది. సాగు ఖర్చులు పోనూ రైతుకు రూ. 14,788 నికరాదాయం లభించింది.
అంశం | కదిరి అమరావతి (1535) | కె-6 |
---|---|---|
దుక్కిదున్నడానికి | 2,000/- | 2,000/- |
విత్తనం | 10,450/- | 7,000/- |
సేంద్రీయ ఎరువులు | 4,000/- | 4,000/- |
విత్తనం వేయడానికి | 2,000/- | 2,000/- |
కలుపు మరియు అంతరకృషి | 5,000/- | 5,000/- |
పురుగు మందులు (రెండుసార్లు) | 1,350/- | 2,350/- |
ఎరువులు | 600/- | 600/- |
కట్టెపీకడానికి & నూర్పిడి | 8,000/- | 8,000/- |
మొత్తం ఖర్చు | 33,400/- | 30,950/- |
దిగుబడి ఎకరాకు (బస్తా ఒక్కోటి 40 కి.) | 14.25/- | 9.24/- |
క్విం (ధర) | 4,950/- | 4,950/- |
వచ్చిన ఆదాయం | 70,537/- | 45,738/- |
నికరాదాయం | 37,137/- | 14,788/- |
యస్. నజ్మ, రీసర్చ్ అసోసియేట్ (సస్య ఉత్పత్తి),
బి. షైని ప్రియాంక, రీసర్చ్ అసోసియేట్ (సస్య రక్షణ),
డా|| జి. ప్రసాద్ బాబు, కో-ఆర్డినేటర్, కె. రాఘవేంద్ర చౌదరి, విస్తరణ శాస్త్రవేత్త,
ఏరువాక కేంద్రం, బనవాసి, ఫోన్ : 9989623810