ఏ పంటనుండైనా అధిక దిగుబడులు సాధించాలంటే రైతు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం విత్తనం యొక్క నాణ్యత. విత్తనం నాణ్యమైనదైతే చెట్టు కూడా నాణ్యమైనదవుతుంది. తద్వారా రైతు అధిక దిగుడులు సాధించవచ్చు. సాధారణంగా రైతులు విత్తనాలను పరిశోధనా స్థానాలు, ఎన్‌.జి.ఓ లేదా ఇతర ప్రైవేటు సంస్థల నుండి కొనుగోలు చేస్తారు. అయితే వివిధ కారకాల వల్ల విత్తనాలు నాణ్యతను కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల రైత విత్తన కొనుగోలు తరువాత మొలక శాతాన్ని చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనగా మొలకశాతం అధికంగా ఉంటేనే మొక్కల సాంధ్రత అధికంగా ఉండి దిగుబడి అధికంగా వస్తుంది. అందువల్ల రైతులు నాణ్యమైన విత్తనాల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకోవాలి.

నాణ్యమైన విత్తనం - ముఖ్యలక్షణాలు :

విత్తనం రైతు ఎంచుకున్న రకానికి మాత్రమే చెందినది అయి ఉండాలి. మరియు విత్తనం 100 శాతం జన్యు స్వచ్ఛత కలిగి ఉండాలి. (జన్యు స్వచ్ఛత అంటే విత్తనం నాటినప్పుడు 100 శాతం విత్తనం పొందడం)

'భౌతిక స్వచ్ఛత' అనునది విత్తనం యొక్క ముఖ్యమైన గుణం. భౌతికస్వచ్ఛత అంటే విత్తనానికి ఉండవలసిన రంగు ఉండి, తాలు మరియు సగం నిండిన గింజలు ఉండకూడదు.

కొనుగోలు చేసిన విత్తనాల్లో వేరే రకానికి చెందిన విత్తనాలు మరియు కలుపు విత్తనాలు ఉండకూడదు.

అవసరమైన జడపదార్థాలు అంటే మట్టి పెడలు, ఇసుక, దుమ్ము మొదలైనవి ఉండకూడదు.

విత్తనం ఎల్లప్పుడూ సురక్షితమైన ప్యాకింగ్‌ చేయండి. విత్తనానికి సంబంధించిన వివరాలతో ముద్రించిన లేబుల్‌ కలిగి ఉండాలి.

వీటితో పాటుగా విత్తనం అధిక మొలకశాతం కలిగి ఉండాలి.

వివిధ రకాల పంటల్లో మొలకశాతం వివరాలు :

వరి 80 శాతం, గోధుమ 85 శాతం, జొన్నలు 75 శాతం, మొక్కజొన్న : సూటిరకాలు 90 శాతం - సంకర రకాలు 80 శాతం, సజ్జ మరియు కొర్ర 75 శాతం, శనగ 85 శాతం, అపరాలు 75 శాతం, నూనె గింజలు : సోయా చిక్కుడు, ఆముదం, వేరుశెనగ-70 శాతం, ప్రొద్దుతిరుగుడు, నువ్వులు-80 శాతం, నార పంటలు 75 శాతం (పత్తి, గోగు), కూరగాయలు 60-70 శాతం.

రైతులు తమస్థాయిలో మొలకశాతాన్ని కింది పద్ధతుల ద్వారా పరిక్షించుకోవచ్చు :

గుడ్డలో మూటకట్టు పద్ధతి :

వంద విత్తనాలను తడిగుడ్డలో మూటకట్టి, ప్లేటులో పెట్టి తరుచూ మూటను నీటితో తడుపుతూ ఉండాలి. విత్తనాలు మొలకలొచ్చాక లెక్కించి మొలకశాతాన్ని తెలుసుకోవచ్చు.

ట్రే పద్ధతి :

ఈ పద్ధతిని లావుగింజలైన ఆముదం, పత్తి మరియు వేరుశనగ మొదలగు విత్తనాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఇందులో మొదటిగా ఒక ప్లాస్టిక్‌ ట్రే గాని, లేదా కుండీని గాని తీసుకొని ఇసుకతో నింపాలి. తదుపరి వంద విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత స్థలంలో విత్తుకోవాలి. ఇసుకను నీటితో తడుపుతూ ఉంటే 7-10 రోజుల్లో మొలకలు వస్తాయి. అప్పుడు రైతులు వందకు ఎన్ని మొలకలొచ్చాయో లెక్కించి మొలకశాతం తెలుసుకోవచ్చు. ముందుగా నిర్ధేశించిన శాతం కంటే తక్కువగా మొలకలొస్తే నాణ్యత లోపించిన విత్తనంగా భావించాలి.

పెట్రి డిష్‌ పద్ధతి :

చిన్న సైజు విత్తనాలు అనగా వంగ, టమాట మరియు మిరప మొదలగు విత్తనాల మొలకశాతం ఈ పద్ధతి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో మొదటిగా పెట్రిడిష్‌లో బ్లాటింగ్‌ పేపర్‌ అమర్చి మూతపెట్టాలి. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్‌ పేపరును నీటితో తడుపుతూ ఉండాలి. మొలకెత్తిన గింజలను లెక్కించి మొలకశాతాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.

పేపర్‌ టవలు పద్ధతి :

ఈ పద్ధతిని ముఖ్యంగా వరి, పత్తి, పొద్దుతిరుగుడు, జొన్న తదితర విత్తనాల్లో మొలకశాతం తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పద్ధతిలో ముందుగా పేపరు టవలు లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. తదుపరి నేలపై పరచి వంద విత్తనాలను వరుసగా అమర్చాలి. ఇప్పుడు మరొక వస్త్రాన్ని లేదా పేపరు టవలును కాని విత్తనాలపై కప్పాలి. తరువాత రెండింటిని ఒక చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి ఏదైనా లోతైన పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. తేమ ఆరిపోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు నీటితో తడుపుతూ ఉంటే మొలకలు రావడం జరుగుతుంది.

ముఖ్య గమనిక :

మొలకశాతాన్ని లెక్కించేటప్పుడు కుళ్ళిపోయిన, మొలకరాని గట్టి విత్తనాలను, బూజుపట్టిన వేరు, కాండం పూర్తిగా అభివృద్ధి చెందని మరియు బలహీనంగా ఉన్న మొక్కలను పరిగణలోకి తీసుకోకూడదు. విత్తనం యొక్క మొలకశాతం తగ్గిపోవడానికి గల ముఖ్య కారణాలు

అధిక తేమశాతం వల్ల విత్తనాల నిల్వలో త్వరగా మొలకశాతం క్షీణిస్తుంది.

రైతులు పరిపక్వత రాని గింజల నుండి విత్తనాలను సేకరించినప్పుడు

వివిధ రకాల చీడపీడలు, శిలీంద్రబీజాలు, గుడ్లు, మొదలగు వాటివల్ల విత్తనాలు పాడవడం జరుగుతుంది.

గాలి, వెలుతురు లేని రూపుల్లో నిల్వ చేయడం వల్ల మొలకశాతం తగ్గిపోతుంది.

ఎరువులు, పురుగులు మరియు మిరపకాయల బస్తాల పక్కన విత్తనాలను నిల్వ చేయడం.

విత్తనం చుట్టూ అనుకూలమైన ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్‌ సరఫరా లేకపోవడం

దుక్కి సరిగా దున్నకపోవడం

కలుపు మందుల పిచికారి అవగాహన లేకపోవడం వల్ల కూడా మొలకశాతం ఉన్న మొలకలు పెరగకపోవడం.

విత్తనం యొక్క మొలకశాతం పెరగడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు :

పరిపక్వత వచ్చిన గింజల నుండి విత్తనాలు సేకరించాలి.

విత్తనాలు నిల్వ చేసే ముందు విత్తనంలో తేమశాతం తగినంత మాత్రమే ఉండేట్లు చూసుకోవాలి. వివిధ రకాల పంటలను బట్టి 9-12 శాతం తేమ ఉండేటట్లు చూసుకోవాలి.

విత్తనాలను కొనేటప్పుడు ఖచ్చితంగా లేబుల్‌ మీద మొలకశాతం పరీక్షించిన తేదీ మరియు విత్తన వాడుక సమయాన్ని చూసి కొనుగోలు చేయాలి.

విత్తుకునే ముందు విత్తన బస్తాను తీసి విత్తనం ఎలా ఉందో పరీక్షించుకోవాలి. ఎందెకంటే నిల్వ సమయంలో వరి, గోధుమ మరియు మొక్కజొన్న విత్తనాలను వడ్లచిలుక, ముక్కుపురుగు వంటివి ఆశించి విత్తనాన్ని మొలకెత్తకుండా చేస్తాయి.

విత్తనం నాటినప్పుడు కావలసిన తేమ, ఉష్ణోగ్రత చూసుకోవడం సాధారణంగా పంటలను బట్టి 18 సెం.మీ. నుండి 43 సెం.మీ. ఉష్ణోగ్రత వరకు మొలకెత్తుతాయి.

వరి పంటలో కత్తెర మరియు వర్షాకాలంలో మొలకెత్తిన విత్తనాలు నారుమడిలో చల్లినా అధిక ఉష్ణోగ్రతల వల్ల మొలకనారుగా మారదు. అలాగే యాసంగిలో అధిక చలి వల్ల కూడా మొలకశాతం తగ్గి మొలక పెరగదు.

విత్తనం వేసే ముందు ఖచ్చితంగా విత్తనశుద్ధి చేసినట్లయితే మొలకశాతం పెరగడమేకాకుండా ప్రధాన పంటల్లో కూడా దాదాపుగా 20-30 రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు.

వి. సాయికిరణ్‌, పి. గోన్యానాయక్‌, వై. ప్రశాంత్‌, జెనెటిక్స్‌ ప్లాంట్‌ బ్రీడింగ్‌, ఫోన్‌ : 9701592326