పాలలో వెన్న శాతం తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సాధారణంగా పాలలో ఉండే వెన్న శాతాన్ని బట్టి పాలధర నిర్ణయించబడుతుంది. కాబట్టి పాలలో ఉండే వెన్న శాతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. పాల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పుడు వెన్నశాతం తక్కువగా ఉండడం సాధారణం అయితే పశుగ్రాసాల లభ్యత తక్కువగా ఉండడం, ఎండ వేడిమి, తక్కువ ఉష్ణోగ్రతల వలన పాడి పశువులు సరిగా మేతతీసుకోక పోవడం వలన, పశువులు అసౌకర్యానికి, అనారోగ్యానికి గురికావడం వలన పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్నశాతం కూడా తగ్గుతుంది.

సాధారణంగా గేదెపాలలో వెన్నశాతం6 నుండి 8 శాతం వరకు, దేశవాళీ పాడి పశువుల పాలలో 4 నుండి 4.5 శాతం, సంకర జాతి పాడి పశువుల పాలలో 3 నుండి 4 శాతం వరకు ఉంటుంది.

పాలలో వెన్నశాతాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలు :

జన్యు కారణాలు :

పాడిపశువులలోజన్యుసామర్థ్యాన్ని బట్టి వెన్నశాతం ఉంటుంది. పశువుల్లో జాతిని బట్టి కూడా పాలలో వెన్నశాతంలో మార్పులు, హెచ్చుతగ్గులు ఉంటాయి.

గేదెల్లో అయితే ముర్రాజాతి, జాఫరాబాదికి జాతి గేదెల పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా దేశవాళికి చెందిన ఆవులైన సాహివాల్‌, గిర్‌, థిమోని, ఒంగోలు జాతికి చెందిన పాడి పశువుల్లో పాల దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ వెన్నశాతం సంకర జాతి పాడి పశువుల కంటే అధికంగా ఉంటుంది. సంకర జాతి పాడి పశువుల్లో పాల ఉత్పత్తి అధికంగా ఉండి వెన్నశాతం గేదెపాల కంటే, దేశవాళికి చెందిన ఆవు పాలకంటే తక్కువగా ఉంటుంది. వీటికీ కారణం జన్యుపరమైన కారణాలని చెప్పవచ్చు.

పాలలో వెన్నశాతం పాడి పశువుల జాతి, వయసు, పాల దిగుబడి, మేత పాలిచ్చే కాలం (పాడికాలం) వాతావరణ, గహవసతి మొదలగునవి కూడా ప్రభావితం చేస్తాయి.

వాతావరణ ప్రభావం :

వాతావరణంలో మార్పుల వల్ల ముఖ్యంగా వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రల వల్ల కూడా పాలలో వెన్నశాతం తగ్గుతుంది. వాతావరణంలో ఉష్ణోగ్రత 100 ఫారెన్హీట్‌ పెరిగితే పాలలో వెన్నశాతం 0.1-0.2 శాతం వరకు తగ్గుతుంది. కాబట్టి వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల పాలలో వెన్నశాతం తగ్గుతుంది. ఎండాకాలం ముఖ్యంగా సాయంత్రం పూట పిండే పాలలో వెన్నశాతం తక్కువగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల వల్ల పాడి పశువుల శరీరంలో జీర్ణశోషణ ప్రక్రియలపై ప్రభావం ఉంటుంది. తద్వారా పాలలో వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి ఎండాకాలంలో పాడిపశువులు అసౌకర్యానికి గురికాకుండా తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా సంకరజాతి ఆవులను పెంచేవారు వీలైతే పాకలలో ఫ్యాన్లు, కూలర్లను అమర్చుకోవడం మంచిది.

ఎండాకాలంలో పశువులకు బయటి మేతకు పంపేవారు, వ్యాయామం కోసం 3-4 కిలో మీటర్ల దూరం తిరగడం చేత పాలలో వెన్నశాతం పెరుగుతుంది. అంతకంటే ఎక్కువ దూరం పశువులను బయట తిప్పితే పశువులు అలసట చెంది, శక్తిని కోల్పోయి, పాలలోవెన్న శాతం తగ్గుతుంది. గేదెలను రోజుకు 2-3 సార్లు నీటితో కడగాలి వీలైతే శుభ్రంగా ఉండే నీటిలో ఈదించాలి.

శీతా కాలంలో తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా కూడా పాలలో వెన్న శాతాన్ని ప్రభావితం చేస్తాయి.

మేత, మేపు :

పాడి పశువులకు ప్రతిరోజు 30-40 కిలోల వరకు పచ్చిమేత ఇవ్వాలి. ఇందులో మూడోభాగం అంటే 10-15 కిలోల వరకు పప్పుజాతి పశుగ్రాసాలను మిగతా భాగం 28-30 కిలోల వరకు గడ్డిజాతి, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఇవ్వాలి. ప్రతిరోజు 6-8 కిలోల వరకు ఎండు గడ్డిని ఇవ్వాలి. ముఖ్యంగా జొన్నచొప్ప, సజ్జచొప్ప, మొక్కజొన్న చొప్పలను ఎండుగడ్డిగా వాడడం మంచిది. ఈ చొప్ప లభ్యం కాని పక్షంలో వరిగడ్డిని ఇవ్వాలి. ఈ విధంగా ఎండుగడ్డిని వాడడం వల్ల పాలలో వెన్నశాతం తగ్గకుండా ఉంటుంది.

పప్పుజాతి పశుగ్రాసాలైన, బర్సీమ్‌, లూసర్న్‌, అలసంద, పిల్లి పెసర, జనుము, స్టైలో మొదలగు వాటిని ధాన్యపు జాతి గ్రాసాలతోకాని, లేదా గడ్డిజాతి పశుగ్రాసాలతో కలిపి మేపడం వల్ల పాలలో వెన్నశాతం పెరుగుతుంది. సుబాబుల్‌, అవిశె, హెడ్జ్లూసర్న్‌ వంటి పశుగ్రాసపుచెట్లను పెంచి వాటి ఆకులను పశుగ్రాసంగా ఇవ్వవచ్చు. పశుగ్రాసాలను పూత దశలో ఉన్నప్పుడు కోసి మేపినట్లయితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది.

పశుగ్రాసాలను చాఫ్‌కట్టర్‌ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి మేపాలి అయితే ఈ ముక్కలు 1/4 అంగుళం కంటే చిన్నగా ఉండకూడదు. ఇంతకంటే తక్కువగా కత్తిరించి మేపినట్లయితే పాలలో వెన్నశాతం తగ్గుతుంది.

పశువుల శరీరంలో ఉన్న సూక్ష్మక్రిములు విడుదల చేసే సెల్యులోస్‌ అనే ఎంజైముల వల్ల పీచుపదార్థం జీర్ణం జరుగుతుంది. కాబట్టి పశుగ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మేపడం వల్ల పీచు పదార్థం ఎక్కువగా జీర్ణమై పాలలో వెన్నశాతం పెరుగుతుంది. పాలలో వెన్నశాతం పాడిపశువులకు ఇచ్చే మేతలో ముఖ్యంగా పశువుకు కావలసిన జీర్ణమయ్యే మాంసక త్తులు, జీర్ణమయ్యే శక్తినిచ్చే పదార్థాలు, దాణా మిశ్రమం, పశుగ్రాసాలపై ఆధారపడి ఉంటుంది. దాణా మిశ్రమంలో పత్తిగింజల చెక్క కొబ్బరి చెక్క సోయాచిక్కుడు గింజల చెక్క పొద్దుతిరుగుడు చెక్క వేరుశనగ చెక్క మొదలగు వాటిని కలిపి ఇచ్చినట్లయితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది.

పంట అవశేషాలను ఉపయోగించి సంపూర్ణ సమీకత ఆహారాన్ని తయారు చేసి పశువులకు మేతగా ఇచ్చినట్లయితే దాణాకయ్యే ఖర్చును తగ్గించవచ్చు. ఈ సంపూర్ణ సమీకత ఆహారంలో పశువులకు కాలవసిన పోషక పదార్థాలు ఉండేటట్లు, పంట అవశేషాలతో పాటుగా ధాన్యపుగింజలు, పత్తి గింజల చెక్కలు, వేరుశనగ చెక్కలు మొదలగు వాటిని ఉపయోగించి దాణా మిశ్రమాన్ని తయారుచేసి ఇచ్చినట్లయితే పాడిపశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. పాలలో వెన్నశాతం కూడా తగ్గకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలంలో గ్రాసాల కొరత ఉన్నప్పుడు సంపూర్ణ సమీకత ఆహారాన్ని తయారు చేసుకుని మేతగా ఇవ్వాలి.

వర్షాకాలంలో శీతాకాలంలో పశుగ్రాసాల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ గ్రాసాలను చిన్న ముక్కలుగా కత్తిరించి మాగుడు గడ్డి (సైలేజ్‌) గా తయారు చేసుకొని నిల్వ ఉంచుకోవాలి. ఎప్పుడైతే పశుగ్రాసాల కొరత ఉంటుందో అప్పుడు ముఖ్యంగా ఎండాకాలంలోను, కరువు సమయాల్లోనే ఈ సైలేజ్‌ని పశువులకు మేతగా ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల పాడిపశువుల్లో పాల దిగుబడి, పాలలో వెన్నశాతం తగ్గకుండా ఉంటుంది.

పాడి పశువులకిచ్చే దాణా మిశ్రమంలో గోధుమ తవుడు లేదా వరి తవుడును కలిపి ఇచ్చినట్లయితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది. ఈ దాణాను తడిపి ఇవ్వడం మంచిది. పాడి పశువులకు దాణాను, పాల ఉత్పత్తిని బట్టి, పాలలో ఉండే వెన్నశాతాన్ని బట్టి, శరీరబరువును బట్టి ఇవ్వడం మంచిది. దాణా మిశ్రమంలో మొలాసిస్‌ ను కలిపి ఇచ్చేటట్లయితే 10 శాతం కంటే ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా మొలాసెసను కలపడం వల్ల పాలలో వెన్నశాతం తగ్గుతుంది. పాడిపశువులకు తయారు చేసే దాణా ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రత్యామ్నాయంగా చౌకగా ఉండే అజొల్లాను పాడి పశువులకు మేతగా ఇవ్వాలి. రోజుకు 1-1.5 కిలోల వరకు అజొల్లాను దాణాలో కలిపి కూడా మేపవచ్చు. అజొల్లాను మేపడం వల్ల పశువులు తేలికగా జీర్ణం చేసుకొని ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పాలలో వెన్నశాతం పెరుగుతుంది. అజొల్లాను మేపడం వలన 25 శాతం వరకు దాణా ఖర్చు తగ్గించుకోవచ్చు. అజొల్లాను పాకలకు సమీపంలోనే పెంచవచ్చు కాబట్టి అజొల్లా పెంపకానికి ఖర్చు తక్కువగా ఉంటుంది. కాబట్టి దాణాకు ప్రత్యామ్నాయంగా అజొల్లాను మేతగా ఇవ్వాలి. అజొల్లాను వాడడం వల్ల పాలలో వెన్నశాతంతో పాటు ఎస్‌. ఎన్‌. ఎఫ్‌ శాతం కూడా పెరుగుతుంది.

పాడిపశువులకు ఇచ్చే మేతలో 20-25 శాతం వరకు పీచు పదార్థం ఉండేటట్లు చూడాలి. మేతలో పీచుపదార్థం తక్కువగా ఉన్నట్లయితే పాలలో వెన్నశాతం తగ్గుతుంది. లేతగా ఉండే పచ్చిగడ్డిలో పీచుపదార్థం తక్కువగా ఉంటుంది. కాబట్టి పచ్చిమేతతో పాటుగా ఎండుగడ్డిని కలిపి ఇచ్చినట్లయితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది. దాణాలో ఎక్కువగా గింజలను ఉపయోగించడం వల్ల సెల్యులోజ్‌ జీర్ణం తగ్గడం, ఆమ్లశాతం పెరగడం తద్వారా పాల దిగుబడి, పాలలో వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి దాణాలో అధికంగా ధాన్యపు గింజలను ఉపయోగించకూడదు.

పాలలో వెన్నశాతం పెంచడానికి మార్కెట్లో లభించే బైపాస్‌ ఫ్యాట్‌, ఫ్యాట్‌ ప్లస్‌ మొదలగు వాటిని రోజుకు 50-100 గ్రా. వరకు దాణాతో కలిపి ఇవ్వాలి. వీటిలో జీర్ణమయ్యే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలలో వెన్నశాతం పెరుగుతుంది. ప్రొబయోటిక్స్‌, ఈస్ట్‌ కల్చర్‌ మొదలగు వాటిని దాణాతో పాటుగా కలిపి ఇచ్చినట్లయితే పాలలో వెన్నశాతం పెరుగుతుంది. రోజుకు 20-25 లీటర్ల పాలిచ్చే పాడిపశువులకు దాణా మిశ్రమంతో పాటుగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అదనంగా ఈ బైపాస్ఫ్యాట్‌ను రోజుకు 100 గ్రా. వరకు ఇచ్చినట్లయితే పాలలో వెన్నశాతం తగ్గకుండా ఉంటుంది. పాలలో వెన్నశాతాన్ని పెంచడానికి మొక్కజొన్న బయోలిక్విడ్‌, యూరియా, మొలాసిస్‌ ఇటుకలు, ఖనిజ లవణపు ఇటుకలను కూడా ఇవ్వవచ్చు. గడ్డి, దాణా, ఖనిజలవణ మిశ్రమం, విటమిన్లను కలపి మేతగా ఇవ్వడం ద్వారా కూడా పాలదిగుబడి, పాలలో వెన్న శాతం పెరుగుతుంది.

ఇతర కారణాలు :

పాలు పిండేటప్పుడు చివరి ధారల్లో వెన్నశాతం అధికంగా ఉంటుంది కాబట్టి చివరి పాలను పూర్తిగా పిండాలి. పాడిపశువులు వట్టిపోయేముందు ఇచ్చే పాలలో వెన్నశాతం ఎక్కువగా ఉంటుంది. పాలను నెమ్మదిగా పిండితే కూడా వెన్నశాతం తగ్గుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా 4-5 ని||ల్లో పాలను పూర్తిగా పిండాలి. పాలను పిండడానికి నైపుణ్యవంతులను వినియోగించడం మంచిది.

పశువులు ఎదలో ఉన్నప్పుడు పాల ఉత్పత్తితో పాటుగా పాలలో వెన్నశాతం కూడా తగ్గుతుంది. పాడి పశువుల్లో వయసు పెరిగిన కొద్ది ఇచ్చే పాలలో వెన్నశాతం తక్కువగా ఉంటుంది.

పాడి పశువుల ఈత చివరిలో పాల ఉత్పత్తి తగ్గి పాలలో వెన్న శాతం పెరుగుతుంది. పాడి పశువులను పరుగెత్తించడం, పాలు పిండే వ్యక్తి మారి నెమ్మదిగా పాలను పంపడం వల్ల కూడా పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పాడి పశువులు అనారోగ్యానికి గురి అయినప్పుడు, మేత సరిగా తినక పోవడం, తద్వారాపాల దిగుబడి తగ్గి, పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి అనారోగ్యానికి గురి అయిన పశువులను గుర్తించి తగు చికిత్సను వెంటనే ఇప్పించాలి. పాడి పశువులకు ఎండు మేతలను దాణాను మేపక ముందే 3 గంటల ముందుగా ఇవ్వాలి. దాణాను మేపిన తర్వాత గ్రాసాలను మేపినట్లయితే పాలలో వెన్న శాతం తగ్గుతుంది. పాడి పశువులకు దాణాను, పశుగ్రాసాలను రోజుకు రెండుసార్లు కాకుండా 3-4 సార్లు మేపడం మంచిది. దాణాను తడిపి మేపాలి. పాలలో నీళ్ళను కలపడం వలన పాలలో వెన్న శాతం తగ్గుతుంది. కాబట్టి పాలలో నీళ్ళను కలపకూడదు. ఈ విధంగా వేసవిలో పాడి పశువుల పెంపకంలో మంచి యాజమాన్య పద్ధతులు పాటించి పోషణలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పాలలో వెన్న శాతం తగ్గకుండా పాడి పశువుల పెంపకం దారులు అధిక లాభాలను పొందవచ్చు.

డా|| జి. రాంబాబు, పశువైధ్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184